Sharmila: నిరుద్యోగ దీక్ష‌కు దిగిన వైఎస్‌ ష‌ర్మిల‌

  • నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో దీక్ష‌
  • ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్‌ కుటుంబం
  • కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన షర్మిల‌
 Sharmila Starts Nirdyoga Deeksa

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్షకు దిగారు. తెలంగాణలో నిరుద్యోగుల‌ సమస్యలపై ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తానని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో పర్యటించి, గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్‌ కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం ప‌లువురు నేత‌ల‌తో క‌లిసి ఆమె నిరుద్యోగ దీక్ష ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష జ‌రుగుతుంది. ఇప్ప‌టికే ఆమె ప‌లు సార్లు నిరుద్యోగ దీక్ష చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందేన‌ని, అప్ప‌టి వ‌ర‌కు తాను నిరుద్యోగుల త‌ర‌ఫున పోరాడుతూనే ఉంటాన‌ని ష‌ర్మిల ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.

అలాగే, 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌భుత్వ బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ దీక్ష‌లు చేస్తాన‌ని చెప్పారు. దీక్ష‌లో ప్ర‌జాగాయ‌కులు పాట‌లు పాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డుతున్నారు.

More Telugu News