Bhuvaneswari: సాఫ్ట్ వేర్ ఇంజినీరు భువనేశ్వరి హత్యోదంతాన్ని వివరించిన ఏఎస్పీ సుప్రజ

  • రుయా ఆసుపత్రిలో కాలిన శవం అవశేషాలు
  • భువనేశ్వరివిగా గుర్తించిన పోలీసులు
  • మృతురాలి సోదరి అనుమానంతో పోలీసుల దర్యాప్తు
  • భర్త శ్రీకాంత్ రెడ్డే హంతకుడని నిర్ధారణ
  • శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్
Police explains how Srikanth Reddy kills his wife Bhuvaneswari

ఇటీవల తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మృతదేహం దగ్ధం కావడం సంచలనం సృష్టించింది. ఆ మృతదేహం సాఫ్ట్ వేర్ ఇంజినీరు భువనేశ్వరిది అని గుర్తించిన పోలీసులు, ఆమెను చంపింది భర్త శ్రీకాంత్ రెడ్డి అని నిర్ధారించారు. అతడిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ఘోరంపై అడిషనల్ ఎస్పీ సుప్రజ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.

ఏఎస్పీ సుప్రజ చెప్పిన వివరాల ప్రకారం....

శ్రీకాంత్ రెడ్డి, భువనేశ్వరిలది ప్రేమ వివాహం. శ్రీకాంత్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా బద్వేలు కాగా, భువనేశ్వరి చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన యువతి. వీరిద్దరూ మూడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. భువనేశ్వరి సాఫ్ట్ వేర్ నిపుణురాలు కాగా, శ్రీకాంత్ రెడ్డి అవినీతి నిర్మూలన పేరిట ఓ సంస్థ స్థాపించాడు. వీరిద్దరికీ ఓ కుమార్తె ఉంది. శ్రీకాంత్ రెడ్డి కొన్నాళ్లుగా కట్నం కోసం భువనేశ్వరిని వేధింపులకు గురిచేస్తున్నాడు. జూన్ 21న ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.

దాంతో శ్రీకాంత్ రెడ్డి తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య ముఖంపై దిండును గట్టిగా అదిమి ఆమెను హత్య చేశాడు. ఆమె నగలన్నీ తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు వరకు భువనేశ్వరి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచాడు. ఆపై ఓ పెద్ద ట్రాలీ సూట్ కేసు కొనుగోలు చేసి, భార్య శవాన్ని అందులో ఉంచాడు. ఓ క్యాబ్ లో ఆ సూట్ కేసుతో సహా రుయా ఆసుపత్రికి వెళ్లాడు. సూట్ కేసులో ఏముందని క్యాబ్ డ్రైవర్ అడిగితే, వెంటిలేటర్ అని సమాధానం చెప్పాడు.

రుయా ఆసుపత్రికి చేరుకున్నాక అక్కడి ఔషధ నిల్వ కేంద్రం వద్ద సూట్ కేసును దహనం చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా... తన భార్యకు కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని, చికిత్స పొందుతూ చనిపోయిందని నమ్మబలికాడు. అయితే రుయా ఆసుపత్రిలో కాలిన అవశేషాలు గుర్తించడంతో శ్రీకాంత్ రెడ్డి భయపడి పారిపోయాడు. కుమార్తెను బంధువులకు అప్పగించాడు.

దీనిపై భువనేశ్వరి సోదరి అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో హత్య వ్యవహారం నిర్ధారణ అయింది. కాగా, శ్రీకాంత్ రెడ్డికి నేర చరిత్ర ఉందని ఏఎస్పీ సుప్రజ తెలిపారు. అతడిపై కడపలో ఇప్పటికే ఓ చీటింగ్ కేసు ఉందని వెల్లడించారు. భార్యకు రూ.90 వేల జీతం వస్తుండగా, తాను ఏ పని లేకుండా ఖాళీగా ఉండడంతో శ్రీకాంత్ రెడ్డి జల్సాల కోసం భార్య జీతం తీసుకునేవాడని వివరించారు.

ఓసారి భర్త ఒత్తిడి భరించలేక భువనేశ్వరి రూ.10 లక్షల అప్పు తీసుకువచ్చి ఇచ్చింది. అది చెల్లించాలని కోరడంతో శ్రీకాంత్ రెడ్డి భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్టు ఏఎస్పీ తెలిపారు. కాగా, అపార్ట్ మెంట్ లోని సీసీ టీవీ ఫుటేజి ఈ కేసు దర్యాప్తులో ఉపయోగపడిందని వివరించారు. కాగా, మృతదేహం ఉంచిన సూట్ కేసును తరలించిన క్యాబ్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News