Balka Suman: ఈటల రాజేందర్ ను ఇకనుంచి వెన్నుపోటు రాజేందర్ గా పిలవాలి: బాల్క సుమన్

  • కేసీఆర్ కు ఈటల రాసిన లేఖ నిజమైనది
  • తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో ఈటల తాకట్టు పెట్టారు
  • అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర బీజేపీ నేతలది
Etela Rajender should be called as backstab Rajender says Balka Suman

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈటల రాజేందర్ రాసిన లేఖ నిజమైనదని... అది ఫేక్ లెటర్ అని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. అది ఫేక్ లెటర్ అని ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బండి సంజయ్ ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో ఈటల తాకట్టు పెట్టారని... ఢిల్లీ నేతల ముందు మోకరిల్లారని విమర్శించారు.
 
ఎన్నికల వేళ బీజేపీ వాళ్లు డబ్బు సంచులతో వస్తారని గతంలో ఈటల అన్నారని బాల్క సుమన్ గుర్తు చేశారు. తనకు హైదరాబాదులో 200 ఎకరాలు ఉన్నాయని, ఒక్క ఎకరా అమ్మితే చాలు ఎన్నికల్లో ఖర్చు చేస్తానని చెప్పారని అన్నారు. ఈటల రాజేందర్ ను ఇకపై వెన్నుపోటు రాజేందర్ గా పిలవాలని ఎద్దేవా చేశారు.
 
2001 నుంచి తన కుటుంబం టీఆర్ఎస్ తోనే ఉందని... పూటకో పార్టీ మారే మీలాంటి వాళ్లు నాకు నీతులు చెపుతారా? అని మండిపడ్డారు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తోన్న చరిత్ర తనదని... అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర బీజేపీ వాళ్లదని విమర్శించారు. బీజేపీ నేతలు పగటి వేషగాళ్లని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు తాను ఇక్కడే ఉంటానని చెప్పారు.

More Telugu News