Supreme Court: సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వినోద్ దువాపై దేశ ద్రోహం కేసు కొట్టివేత... ప్రతి జర్నలిస్టుకు రక్షణ అర్హత ఉందన్న సుప్రీం

  • ఢిల్లీ అల్ల‌ర్ల‌పై వినోద్ దువా చేసిన వ్యాఖ్య‌ల‌పై దేశ ద్రోహం కేసు
  • కేసు న‌మోదు చేసిన హిమాచ‌ల్ పోలీసులు
  • సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన వినోద్ దువా
trial in supreme court on sedition

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వినోద్ దువాపై నమోదైన దేశద్రోహం కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఢిల్లీ అల్ల‌ర్ల‌పై వినోద్ దువా చేసిన వ్యాఖ్య‌ల‌పై హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ పోలీసులు దేశద్రోహం కేసును న‌మోదు చేయ‌గా, ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించడంతో న్యాయ‌స్థానం దీనిపై తీర్పు వెల్ల‌డించింది.

 1962 జ‌న‌వ‌రి 20 నాటి కేదార్‌నాథ్ సింగ్ కేసు తీర్పును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, ఈ కేసు చెల్ల‌ద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. అప్ప‌ట్లో ప్రముఖ కవి కేదార్‌నాథ్‌పై బీహార్ ప్ర‌భుత్వం దేశద్రోహం కేసు న‌మోదు చేయించ‌గా ఆయ‌న సుప్రీంకోర్టుకు వెళ్లారు. దానిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం దాన్ని కొట్టి వేసింది. ఈ విష‌యాన్నే సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ, 1962 నాటి ఆదేశాల ప్రకారం, అటువంటి అభియోగాల నుంచి ప్రతి జర్నలిస్టుకు రక్షణ అర్హత ఉందని  పేర్కొంది.  

కాగా, దేశంలో ఓ వైపు కరోనా మరణాలు, మ‌రోవైపు ఉగ్రవాద దాడులపై కూడా ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని వినోద్ దువా ఏడాది క్రితం యూ ట్యూబ్‌ వీడియోలో వ్యాఖ్య‌లు చేశారు. దీంతో హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ నేత ఒక‌రు పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా, దేశద్రోహంతో పాటు ప‌లు కేసులు ఆయ‌న‌పై న‌మోదు చేశారు. దీంతో తన‌కు భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ఉంద‌ని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) ప్రకారం త‌న వ్యాఖ్య‌లు భావ ప్రకటనా స్వేచ్ఛ‌ కిందకే వస్తాయని అప్ప‌ట్లో వినోద్ పేర్కొన్నారు.  

ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరుతూ వినోద్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వాలకూ నోటీసులు జారీచేసి విచారణ కొన‌సాగిస్తూ వ‌చ్చింది. చివ‌ర‌కు ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది.

More Telugu News