B.1.617: భారత్ లో 55 శాతం కొవిడ్ కేసులు 'బి.1.617' వేరియంట్ కారణంగానే!: కేంద్రమంత్రి హర్షవర్ధన్

  • భారత్ లో ప్రబలంగా కరోనా సెకండ్ వేవ్
  • వేగంగా వ్యాపిస్తోన్న బి.1.617 వేరియంట్
  • అనేక రాష్ట్రాల్లో విజృంభిస్తున్న వైనం
  • ఇతర వేరియంట్లను మించిన వేగం
Most cases in India caused by this variant

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం కొనసాగుతుండగా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. భారత్ లో ప్రస్తుతం అనేక కరోనా వేరియంట్లు వ్యాపిస్తున్నప్పటికీ, అన్నింట్లోకి బి.1.617 వేరియంట్ అత్యంత తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోందని తెలిపారు. మిగతా వేరియంట్ల కంటే అధిక స్థాయిలో వ్యాపిస్తోందని వివరించారు. దేశంలోని 55 శాతం కొవిడ్ కేసులకు ఈ బి.1.617 వేరియంటే కారణమని హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఇతర కేంద్ర మంత్రులతో కొవిడ్ పరిస్థితులపై సమీక్ష సందర్భంగా ఆయన ఈ వివరాలు తెలిపారు.

సోమవారం ఉదయం నాటికి ఇన్సాకోగ్ (ఐఎన్ఎస్ఏసీఓజీ) 25,739 శాంపిల్స్ ను పరీక్షించి, వాటిలోని కరోనా వేరియంట్ల జన్యుమార్పుల గుట్టు తెలుసుకుంది. వాటిలో 9,508 శాంపిళ్లలో బి.1.617 వేరియంట్ ను గుర్తించింది.  ఇకపైనా, కరోనా వేరియంట్ల జన్యు ఉత్పరివర్తనాల సంపూర్ణ చిత్రణ కొనసాగిస్తామని, ఆ మేరకు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

బి.1.617 వేరియంట్ ను మొదటగా మహారాష్ట్రలో గుర్తించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శనమిస్తోంది. ముఖ్యంగా, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, ఏపీల్లో ఎక్కువగా ఉనికి చాటుకుంటోంది.

More Telugu News