రఘురామకృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు!
- రఘురాజు మీడియా ముందుకు రాకూడదు
- విచారణకు పిలిచిన 24 గంటల్లో హాజరుకావాలి
- గాయాలను గతంలోలా ఎక్కడా ప్రదర్శించకూడదు
- రఘురాజుకు కస్టోడియల్ విచారణ అవసరం లేదు
విచారణకు పిలిచిన 24 గంటల్లో రఘురాజు హాజరు కావాలని... విచారణకు సంబంధించిన నోటీసును కూడా అధికారులు ఆయనకు 24 గంటల ముందుగానే ఇవ్వాలని సుప్రీం తెలిపింది. పోలీసు విచారణకు రఘురాజు సహకరించాలని ఆదేశించింది. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని ఆదేశించింది. పోలీసుల కస్టడీలో ఆయన పట్ల దురుసుగా వ్యవహరించారనే అభిప్రాయాన్ని న్యాయస్థానం వ్యక్తం చేసింది.
రఘురామకృష్ణరాజుపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించవలసినవి కాదని.. కాబట్టి రాజుకు కస్టోడియల్ విచారణ అవసరం లేదని, ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నామని సుప్రీం చెప్పింది. పది రోజుల్లోగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారుల పూచీకత్తు ట్రయల్ కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇరువర్గాల సుదీర్ఘ వాదనలను వినింది. దాదాపు మూడు విడతలుగా కేసును విచారించింది.