BCCI: భారత్ లో 8 రోజుల బయోబబుల్... ఇంగ్లండ్ లో 10 రోజుల క్వారంటైన్... డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం బీసీసీఐ ప్రణాళిక

  • వచ్చే నెల 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
  • ఫైనల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్
  • ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లో మ్యాచ్
  • ఆపై ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్
  • మూడున్నర నెలలు ఇంగ్లండ్ లోనే భారత్
BCCI plans for Team India

ఇంగ్లండ్ గడ్డపై వచ్చే నెల 18 నుంచి ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నందున టీమిండియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ పయనం అయ్యేముందు స్వదేశంలోనే వారిని 8 రోజుల పాటు బయోబబుల్ లో ఉంచనుంది. ఆపై ఇంగ్లండ్ లో 10 రోజుల పాటు క్వారంటైన్ అమలు చేయనున్నారు.

భారత్ లో టీమిండియా ఆటగాళ్లకు ఈ నెల 25న బయోబబుల్ ప్రారంభం కానుంది. అనంతరం జూన్ 2న ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టగానే భారత ఆటగాళ్లకు క్వారంటైన్ ఉంటుంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత కూడా భారత్ ఇంగ్లండ్ లోనే ఉంటుంది. ఎందుకంటే కోహ్లీ సేన ఇంగ్లండ్ జట్టుతో 5 టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.

కాగా, భారత ఆటగాళ్ల బృందాన్ని ఓ ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ తరలించనున్నట్టు బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ పర్యటనలో ఆటగాళ్ల కదలికలపై కఠిన ఆంక్షలు తప్పవని సూచనప్రాయంగా తెలియజేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్, టెస్టు సిరీస్ ల కోసం ఇంగ్లండ్ లో భారత ఆటగాళ్లు దాదాపు మూడున్నర నెలల పాటు ఉండాల్సి వస్తుంది. అందుకే ఆటగాళ్లతో పాటు వారి కుటుంబాలను కూడా ఇంగ్లండ్ తీసుకెళ్లేందుకు అనుమతినిస్తున్నట్టు బీసీసీఐ అధికారి వెల్లడించారు.

More Telugu News