Supreme Court: సుప్రీంకోర్టులో ఈసీ ప్యానల్ న్యాయవాది రాజీనామా

  • ఈసీ విధానాలకు అనుగుణంగా తన విలువలు లేవన్న మోహిత్
  • ఈ కారణం వల్లే ప్యానల్ ను వీడుతున్నానని వెల్లడి
  • ఈసీకి పని చేయడం తన జీవితంలో మైలురాయని వ్యాఖ్య
EC lawyer quits from supreme court panel

సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం ప్యానల్ లో విధులను నిర్వహిస్తున్న అడ్వకేట్    మోహిత్ డి రామ్ రాజీనామా చేశారు. ఈసీ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా తన విలువలు లేవని అనిపిస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కారణం వల్లే ప్యానల్ నుంచి తాను వైదొలగుతున్నానని చెప్పారు. ఎన్నికల కమిషన్ కు పని చేయడం తన జీవితంలో గొప్ప మైలురాయని అన్నారు.

కోర్టు వాదనలపై ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించాలంటూ సుప్రీంకోర్టులో ఈసీ పిటిషన్ వేసిన నేపథ్యంలో మోహిత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందడానికి ఎన్నికల సంఘమే కారణమని... ఈసీ అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన తీర్పులో ఈ వ్యాఖ్యలను హైకోర్టు పొందుపరచలేదు. కానీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. తమ గౌరవానికి భంగం కలిగించేలా హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఈసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘంకు సుతిమెత్తగా మొట్టికాయలు వేసింది. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మీడియాపై ఫిర్యాదు చేయడం కంటే... తమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు యత్నించాలని హితవు పలికింది. ఆర్టికల్ 19 భావప్రకటనా స్వేచ్ఛను కేవలం ప్రజలకు మాత్రమే కల్పించలేదని... ఆ హక్కులు మీడియాకు కూడా వర్తిస్తాయని తెలిపింది. మీడియాపై ఆంక్షలు విధించి తాము తిరోగమనంలో పయనించలేమని చెప్పింది.

More Telugu News