Supreme Court: కరోనాతో మాకు సంబంధం లేదు.. మా విధులు మేము నిర్వహించాం: సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ

  • ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు
  • ఎవరూ ఎవరినీ నిందించడం లేదన్న సుప్రీంకోర్టు
  • కొన్ని సందర్భాల్లో హైకోర్టు వ్యాఖ్యలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్య
EC arguments in Supreme Court

కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘమే కారణమంటూ మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈసీ అధికారులపై హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేస్తామంటూ హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టును ఈసీ ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను ఈరోజు  జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారించింది.

విచారణ సందర్భంగా తమపై హత్యాయత్నం కేసు పెడతామని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించడం సరికాదని ఈసీ తరపు న్యాయవాది రాకేశ్ ద్వివేది అన్నారు. రాష్ట్రాలను పాలించేది ఎన్నికల సంఘం కాదని చెప్పారు. ఆదేశాలను, మార్గదర్శకాలను జారీ చేయడం మాత్రమే ఈసీ పని అని తెలిపారు. ఎన్నికల ర్యాలీల్లో తనిఖీలు చేసేందుకు ఈసీ వద్ద సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థలు లేవని చెప్పారు. ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని... కరోనా నియంత్రణకు, ఈసీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసీ చాలా బాగా పని చేసిందని కితాబిచ్చింది. ఎవరూ ఎవరినీ నిందించడం లేదని చెప్పింది. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని... దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించడం ఈసీ బాధ్యత అని వ్యాఖ్యానించింది. ఈసీని తక్కువ చేసి మాట్లాడటం హైకోర్టు ఉద్దేశం కాదని... వాదనల సందర్భంలో క్షణికావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేసిందని చెప్పింది. హైకోర్టు వ్యాఖ్యలను జ్యుడీషియల్ ఆదేశాలుగా భావించరాదని తెలిపింది.

ప్రజాప్రయోజనాల దృష్ట్యా కోర్టులు కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటాయని సుప్రీంకోర్టు చెప్పింది. కొన్ని సందర్భాల్లో ఆ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలిపింది. కొందరు జడ్జిలు తక్కువగా మాట్లాడతారని... మరి కొందరు ఎక్కువగా స్పందిస్తారని చెప్పింది. ఏదేమైనప్పటికీ ఈసీ అభ్యర్థన మేరకు సముచిత ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది. ఈ పిటిషన్ పై తీర్పును వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.

More Telugu News