Raghu Rama Krishna Raju: జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరిన రఘురామకృష్ణరాజు.. పిటిషన్ విచారణ అర్హతపై 22న కోర్టు నిర్ణయం

  • అక్రమాస్తుల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ
  • బెయిల్ పై బయటున్న సీఎం జగన్
  • బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్
  • తగిన పత్రాలు లేవంటూ పిటిషన్ రిటర్న్ చేసిన కోర్టు
  • అవసరమైన పత్రాలు అందించిన రఘురామ
CBI Court has taken Raghurama Krishna Raju plea seeking cancellation of CM Jagan bail

అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హమైదనదా? కాదా? అనేది ఈ నెల 22న సీబీఐ కోర్టు నిర్ణయిస్తుంది.

రఘురామకృష్ణరాజు ఇటీవలే ఈ పిటిషన్ దాఖలు చేయగా, పలు అంశాలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అవసరమైన పత్రాలతో మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించింది. కోర్టు నిర్దేశించిన మేర రఘురామకృష్ణరాజు తగిన పత్రాలు సమర్పించారు.

కాగా, తన పిటిషన్ లో రఘురామ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం బెయిల్ పై బయటున్న సీఎం జగన్ 11 చార్జిషీట్లలో ఏ1 నిందితుడిగా ఉన్నారని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు.

అటు, ఈ అంశంపై రఘురామకృష్ణరాజు స్పందిస్తూ... జగన్ కేసుల అంశంపై ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా లేఖ రాశానని, పీఎంఓ నుంచి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నానని తెలిపారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల నివేదికలను కూడా తానే రాస్తున్నట్టు తెలిసిందని అన్నారు.

మూడు రాజధానుల వంటి నిర్ణయాలతో భారతదేశంలో ఎక్కడా లేని ఆలోచనలు ముఖ్యమంత్రికి వస్తున్నాయని వ్యంగ్యం ప్రదర్శించారు. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రభుత్వ సలహాదారులు ఇచ్చిన సలహాలే అందుకు కారణం అయ్యుంటాయని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధమైన అలాంటి సలహాలను ఖండించడానికి రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేసిన ఓ ప్రజాప్రతినిధిగా తనకు బాధ్యత ఉందని భావిస్తున్నానని రఘురామ స్పష్టం చేశారు.

More Telugu News