Nadendla Manohar: అక్షయ గోల్డ్ బాధితులను ఆదుకుంటామని నాడు హామీ ఇచ్చారు... ఇప్పుడెళితే అరెస్టులు చేస్తున్నారు: నాదెండ్ల

  • నాదెండ్లను కలిసిన అక్షయ గోల్డ్ బాధితులు
  • పవన్ తో చెప్పుకుంటే సమస్య తీరుతుందన్న బాధితులు
  • ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న నాదెండ్ల
  • బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
Nadendla Manohar comments on Akshaya Gold fraud

అక్షయ గోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో అక్షయ గోల్డ్ బాధితులు సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకోగా, సీఎం అయిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తేనే అరెస్టులు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

అక్షయ గోల్డ్ ఏపీ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం సభ్యులు ఈ ఉదయం నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ తో చెప్పుకుంటే తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావించి ఇక్కడి వరకు వచ్చామని వారు నాదెండ్ల ముందు గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక సంస్థలు ఆర్థిక నేరాలకు పాల్పడి పేద, మధ్యతరగతి కుటుంబాలకు అపార నష్టం కలిగించాయన్నారు. చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారు 15.94 లక్షల మంది రూ.385 కోట్ల మేర అక్షయ గోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని వివరించారు. ఈ క్రమంలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఏజెంట్లు సొంత గ్రామాల్లో తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. పెట్టుబడులు పెట్టిన ఖాతాదారులు, వారితో పెట్టుబడులు పెట్టించిన ఏజెంట్లకు న్యాయం చేయడంలో అక్షయ గోల్డ్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

అక్షయ గోల్డ్ బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని నాదెండ్ల తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని, ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

More Telugu News