కిషన్ రెడ్డి సంగతి జూన్ 15 తర్వాత తేలుస్తా.. బరాబర్ జవాబిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy warns Kishan Reddy will settle scores after June 15
  • హైదరాబాద్ అభివృద్ధిని కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు
  • మెట్రో, మూసీ, రీజనల్ రింగ్ రోడ్డు పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శ
  • ఉప్పల్ నియోజకవర్గంలో రూ.1600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జూన్ 15వ తేదీ తర్వాత ఆయన సంగతి బరాబర్‌గా తేలుస్తానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉప్పల్‌లో రూ.1600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

"తెలంగాణ ప్రజలతో గోక్కున్నవాడు ఎవరూ బాగుపడలేదు" అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కాళ్లల్లో కట్టెలు పెట్టి ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. "రీజనల్ రింగ్ రోడ్డు అనుమతుల కోసం నేను యాభై సార్లు ఢిల్లీకి వెళ్లాను, ప్రధానిని కలిశాను. దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి లేదా? హైదరాబాద్ ప్రజలు ఆయనకు ఓట్లు వేయలేదా?" అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

అన్ని అనుమతులు వచ్చాక మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని, మూసీ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, మిగిలిన 25 లక్షల టన్నులను కేంద్రంతో కొనిపించే బాధ్యత కిషన్ రెడ్డికి లేదా అని నిలదీశారు. బీజేపీలో ఉంటూనే చీకట్లో ఇతరులతో కిషన్ రెడ్డి సహకారం తీసుకుంటున్నారని, గతంలో కుమ్మక్కు రాజకీయాలు చేసినందుకే ప్రజలు ఓడించారని గుర్తుచేశారు.

అభివృద్ధి విషయంలో తాను రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని సీఎం స్పష్టం చేశారు. "నిజంగా నేను రాజకీయం చేస్తే, బీఆర్ఎస్ నేత బండారు లక్ష్మారెడ్డి తండ్రిగారైన బండారు రాజిరెడ్డి పేరును ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు పెట్టేవాడిని కాదు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను గుర్తించాం" అని తెలిపారు. అభివృద్ధి కోసం కలిసి వస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతామని, కానీ ఆయన సహకరించడం లేదని అన్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం వల్లే తాను ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నానని, కొడంగల్‌లో ఓడిపోయిన తనను ఇక్కడి ప్రజలే ఆశీర్వదించి గెలిపించారని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. మల్కాజిగిరిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగానే పరిపాలన సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని వివరించారు. మూసీ ప్రక్షాళన రెండో దశను నాగోల్ నుంచి గౌరెల్లి వరకు చేపడతామని, వంద రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దామని, ఇప్పుడు నగరాభివృద్ధికి అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Revanth Reddy
Kishan Reddy
Hyderabad Development
Telangana Politics
Musi River Project
Regional Ring Road

More Telugu News