Rahul Gandhi: నిర్మలా సీతారామన్ పై సభాహక్కుల నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

  • రాహుల్ దేశానికి ప్రళయకారకుడిగా తయారయ్యారన్న నిర్మల
  • ప్రతి రోజు  దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శ
  • నిర్మల వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్
Congress gives privilage notice on Nirmala Sitharaman

రాహుల్ గాంధీని భారతదేశ ప్రళయకారకుడిగా పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆమెపై లోక్ సభలో సభాహక్కుల నోటీసులు ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎంపీ ప్రతాపన్ ఈ నోటీసులు ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రతాపన్ మాట్లాడుతూ, పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుడిని భారతదేశ ప్రళయకారకుడిగా పరిహసించడం దారుణమని అన్నారు. ఏ ఉద్దేశంతో ఆమె అలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంపై అసమ్మతిని వ్యక్తం చేసేవారిని దేశ వ్యతిరేకులుగా, విచ్ఛిన్నకర శక్తులుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ధోరణి ఏమాత్రం సహించరానిదని అన్నారు.

అంతకు ముందు లోక్ సభలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, విచ్ఛిన్నకర శక్తులతో కలిసి దేశ ప్రతిష్టను రాహుల్ దిగజారుస్తున్నారని అన్నారు. దేశానికి ప్రళయకారకుడిగా మారుతున్నారని చెప్పారు. దేశంపై నమ్మకం లేని వ్యక్తిగా రాహుల్ మారుతున్నారని... ప్రతిరోజు దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆమెపై సభాహక్కుల నోటీసులను కాంగ్రెస్ ప్రవేశపెట్టింది.

More Telugu News