Revanth Reddy: ముఖ్యమంత్రీ... అన్నదాత మాటగా చెబుతున్నా... సమస్యలపై స్పందించకపోతే అనుభవిస్తావ్!: రేవంత్ రెడ్డి

  • అచ్చంపేట నుంచి హైదరాబాదుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర
  • రాజీవ్ రైతు భరోసా పేరుతో పాదయాత్ర
  • రైతులను కలుస్తూ ముందుకు సాగుతున్న రేవంత్
  • వారి సమస్యలతో సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ
Revanth Reddy writes an open letter to CM KCR

రైతులకు మద్దతుగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అచ్చంపేట నుంచి హైదరాబాదుకు పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై లేఖాస్త్రం సంధించారు. ముఖ్యమంత్రీ... అన్నదాత మాటగా చెబుతున్నా... రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు... వీటిపై స్పందించకపోతే అనుభవిస్తావ్ అని హెచ్చరించారు.

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తెలంగాణలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న డిమాండ్ తో ఈ నెల 7న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి పాదయాత్ర ప్రారంభించానని రేవంత్ తన బహిరంగ లేఖలో తెలిపారు. రాజీవ్ రైతు భరోసా పేరుతో హైదరాబాద్ వరకు సాగే ఈ యాత్రలో రైతులు, రైతు కూలీలను కలుస్తూ వారి సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నానని వెల్లడించారు.

"మీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు, మోసపూరిత విధానాలు, హామీల విస్మరణకు ఎలా పాల్పడిందో రైతులు నా దృష్టికి తీసుకువస్తున్నారు. రుణమాఫీ, రైతుబంధు అంశంలో మీ ప్రభుత్వం మోసం చేసిందన్న భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. అంతేకాదు, వారు తమ డిమాండ్లను నాకు వివరించారు. ఆ డిమాండ్లు నెరవేర్చాలని మీకు స్పష్టం చేస్తున్నాను" అంటూ రేవంత్ పేర్కొన్నారు.

More Telugu News