Yanamala: జగన్ వల్ల ఏపీపై కేంద్రానికి చిన్నచూపు ఏర్పడింది.. అందుకే బడ్జెట్ లో కేటాయింపులు లేవు: యనమల

Because of Jagan no allocations for AP in union budget says Yanamala
  • కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వైసీపీ ఎంపీలు విఫలమయ్యారు
  • కేసుల గురించి మాట్లాడేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు
  • ప్రత్యేక హోదాను జగన్ పట్టించుకోవడం లేదు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఏపీకి ఒరిగింది ఏమీ లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు విఫలమయ్యారని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారే తప్ప... ఆయన పర్యటనల వల్ల రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమీ లేదని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని చెప్పిన జగన్.. హోదాను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కేవలం తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడటానికే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని... ఈ కారణం వల్లే ఏపీపై ఢిల్లీ పెద్దలకు చిన్నచూపు ఏర్పడిందని చెప్పారు.

విభజన చట్టంలోని అంశాలను కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించలేదని యనమల విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించేలా, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేలా బడ్జెట్ లేదని అన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అంశాలు బడ్జెట్ లో లేవని చెప్పారు. ఈ బడ్జెట్ వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని అన్నారు. బడ్జెట్ లో ఏపీ, తెలంగాణ పేర్ల ప్రస్తావన రాలేదని చెప్పారు. రాష్ట్రాలకు చేయూతనిచ్చే అంశాలు బడ్జెట్ లో లేవని తెలిపారు. వైసీపీ ఎంపీలు సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. జగన్ వైఖరి వల్లే ఏపీకి సరైన ప్రాధాన్యత దక్కలేదని అన్నారు.
Yanamala
Telugudesam
Jagan
YSRCP
Union Budget

More Telugu News