Vellampalli Srinivasa Rao: దర్యాప్తులో తేలిన అంశాలనే డీజీపీ చెప్పారు... టీడీపీ, బీజేపీ ఎందుకు భయపడుతున్నాయి?: మంత్రి వెల్లంపల్లి

  • ఏపీలో ఆలయాలపై దాడులు
  • మీడియా సమావేశంలో డీజీపీ వ్యాఖ్యలు
  • డీజీపీ వ్యాఖ్యలను తప్పుబట్టిన టీడీపీ, బీజేపీ నేతలు
  • ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ, బీజేపీ యత్నం అంటూ వెల్లంపల్లి ఆగ్రహం

AP minister Vellampalli questions TDP and BJP why they fears on DGP comments

ఏపీలో ఆలయాలపై దాడుల అంశంలో ఇటీవల డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ, బీజేపీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. దర్యాప్తులో తేలిన అంశాలనే డీజీపీ మీడియాతో చెప్పారని.... టీడీపీ, బీజేపీ ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు.

ఆలయాలపై దాడులతో సంబంధంలేకపోతే ఆ విషయం నిరూపించాలని స్పష్టం చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం జగన్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతుంటే, ప్రభుత్వ పథకాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ, బీజేపీ ఆలయాలపై దాడులు చేస్తున్నాయని వెల్లంపల్లి ఆరోపించారు.

దైవభక్తి లేని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక, ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని, టీడీపీ హయాంలో కూల్చిన ఆలయాలను తాము పునర్నిర్మిస్తుంటే చంద్రబాబుకు కడుపుమంటగా ఉందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో పెద్ద సంఖ్యలో ఆలయాలను కూల్చినప్పుడు బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడికి వెళ్లారని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News