Srikanth: తనయుడితో కలసి నటించనున్న శ్రీకాంత్!

  • 24 ఏళ్ల క్రితం వచ్చిన హిట్ సినిమా 'పెళ్లిసందడి'
  • అదే పేరుతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రాఘవేంద్రరావు
  • గౌరి రోణంకి దర్శకురాలిగా పరిచయం
  • హీరో హీరోయిన్లుగా రోషన్.. మాళవిక నాయర్   
Srikanth acts together along with his son

1996లో వచ్చిన 'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో చాలామంది సినీ అభిమానులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. చిన్న సినిమాగా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ విజయంతో హీరో శ్రీకాంత్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. వరుసపెట్టి పలు సినిమాలలో నటించాడు.

ఇప్పుడీ చిత్రానికి అదే పేరుతో దర్శకుడు రాఘవేంద్రరావు సీక్వెల్ నిర్మిస్తున్నారు. ఆయన వద్ద పనిచేసిన గౌరి రోణంకి ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. మలయాళ భామ మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుంది.

ఇదిలావుంచితే, ఈ సీక్వెల్ లో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రను పోషించనున్నట్టు తాజాగా తెలుస్తోంది. అంటే, తండ్రీకొడుకుల్ని ఒకే చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నారన్న మాట! ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని కె.కృష్ణమోహన్ రావుతో కలసి ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది.

More Telugu News