Corona Virus: కరోనా టీకా అందరికీ ఇస్తామని చెప్పలేదు.. అందరికీ అవసరం లేదు కూడా!: కేంద్రం వివరణ

  • అవసరమైనంత మందికి ఇస్తే సరిపోతుంది
  • వైరస్ చైన్‌ను తెగ్గొట్టడమే టీకా ప్రధాన లక్ష్యం
  • మాస్కులు ధరిస్తూ రక్షణ పొందాల్సిందే
we did not said the we give corona vaccine to all

దేశంలోని అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అవసరమైనంత మందికి టీకా ఇస్తే సరిపోతుందని పేర్కొంది. వైరస్ చైన్‌ను తెగ్గొట్టడమే కరోనా టీకా ప్రధాన లక్ష్యమని, దానిని సాధించేందుకు దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. నిజానికి దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేస్తామని తామెప్పుడూ చెప్పలేదని తేల్చిచెప్పారు.

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్‌తో కలిసి నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. జనాభాలో కొద్దిమందికి మాత్రమే టీకాలు ప్రారంభిస్తామని, కాబట్టి మిగతా వారు కరోనా నుంచి తప్పించుకునేందుకు రక్షణ కవచాలుగా మాస్కులను ఉపయోగించాలని బలరాం భార్గవ సూచించారు.

వ్యాక్సిన్లపై వచ్చే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మీడియా, వ్యాక్సిన్ తయారీదారులపైనా ఉందని భార్గవ పేర్కొన్నారు. సీరం ఇనిస్టిట్యూట్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా టీకా అభివృద్ధి ప్రక్రియలో ఎటువంటి మార్పులు ఉండబోవని, నిర్ణీత కాలవ్యవధిలోనే ప్రయోగాలు పూర్తవుతాయని రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు.

More Telugu News