Chandrababu: చివరకు స్టిక్కర్ ముఖ్యమంత్రిగా మిగిలిపోతావ్: జగన్ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

  • ఇప్పటికే కట్టిన ఇళ్లకు బిల్లులు ఇవ్వడం లేదు
  • లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చే పరిస్థితి లేదు
  • పాదయాత్రలో ఉచితంగా ఇళ్లను ఇస్తానని జగన్ చెప్పారు
Chandrababu calls Jagan as Sticker CM

ఏపీ అసెంబ్లీ ఈరోజు పేదలకు ఇళ్ల అంశంపై దద్దరిల్లింది. టిడ్కో ఇళ్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పటికే కట్టిన ఇళ్లకు బిల్లులు ఇవ్వని పరిస్థితి ఉందని, లబ్ధిదారులకు ఇళ్లను ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. తాము కట్టిన ఇళ్లకు మీ స్టిక్కర్ వేసుకోవడం ఏమిటని మండిపడ్డారు. ఇలాగే చేస్తూ పోతే చివరకు స్టిక్కర్ సీఎంగా మిగిలిపోతావని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూపాయికే ఇల్లు ఇస్తామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటోందని అన్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 300 అడుగుల ఇళ్లు అని తాము మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పామని అన్నారు. తమ మేనిఫెస్టోలో ఏముందో చంద్రబాబుకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి రూ. 6 లక్షల రుణం ఇస్తే... అందులో కేంద్రం రూ. 1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు భరిస్తాయని... మిగిలిన రూ. 3 లక్షలను తమ ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేస్తుందని పాదయాత్రలో హామీ ఇచ్చానని చెప్పారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇళ్లను ఉచితంగా ఇస్తానని జగన్ చెప్పారని అన్నారు. మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేయవద్దని చెప్పారు. పాదయాత్రలో ఒకటి చెప్పి, మేనిఫెస్టోలో మరొకటి పెడితే ఎలాగని ప్రశ్నించారు.

More Telugu News