Bonda Uma: అందుకే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించడానికి వైసీపీ భయపడుతోంది: బోండా ఉమ

bonda uma slams ap govt
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఏపీ సర్కారు మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ నేతలు విమర్శల జల్లు కురిపిస్తున్నారు.

వైసీపీకి ధైర్యముంటే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు సహకరించాలని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు సవాలు విసిరారు. అంతేగానీ ఎన్నికల కమిషనర్‌పై విమర్శలు చేయడం తగదని అన్నారు. వైసీపీ అసమర్థ పాలన వల్లే ఆ పార్టీ నేతలు ఎన్నికలకు భయపడుతున్నారని ఆయన చెప్పారు.

కరోనా విజృంభణ నేపథ్యంలోనూ ఏపీలో బడులు తెరిచారని, ఎన్నికలు మాత్రం వద్దంటున్నారని, విద్యార్థుల ఆరోగ్యం అంటే వైసీపీకి లెక్క లేదా? అని ఆయన నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుతున్నట్లే తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను కూడా కరోనా పేరుతో వైసీపీ నిలిపివేయగలదా? అని బోండా ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్‌ను తిడుతోన్న ప్రభుత్వం దేశంలో ఒక్క వైసీపీయేనని ఆయన విమర్శలు గుప్పించారు. జడ్జిలపై కూడా వైసీపీ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేసిందని చెప్పారు.
Bonda Uma
Telugudesam
YSRCP

More Telugu News