Vienna: కాల్పులతో దద్దరిల్లిన వియన్నా... ముగ్గురి మృతి

  • ఆస్ట్రియాలో ఉగ్రదాడి
  • 15 మందికి గాయాలు
  • దుండగుల్లో ఒకరు ఐసిస్ సానుభూతిపరుడిగా గుర్తింపు
Terror attacks in Vienna city of Austria

ఆస్ట్రియా రాజధాని వియన్నా కాల్పుల మోతతో భీతిల్లిపోయింది. ఇద్దరు సాయుధ ఉగ్రవాదులు నగరంలోని 6 ప్రదేశాల్లో ఆటోమేటిక్ ఆయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 15 మంది వరకు గాయపడ్డారు. వారిలో ఏడుగురికి తీవ్రగాయాలైనట్టు వియన్నా మేయర్ మైఖేల్ లుడ్విగ్ తెలిపారు. ఒక పోలీసు అధికారి కూడా ఈ ఘటనలో గాయపడినట్టు సమాచారం.

కాగా, కాల్పులు జరిపిన సాయుధుల్లో ఒకరిని పోలీసులు మట్టుబెట్టారు. మృతుడు భారీగా ఆయుధాలు కలిగివున్న నేపథ్యంలో అతడి నివాసంలోకి ప్రవేశించేందుకు పోలీసులు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. మరో సాయుధుడి కోసం తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుండగుల్లో ఒకడిని ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిగా గుర్తించారు. ఈ మేరకు ఆస్ట్రియా హోం మంత్రి కార్ల్ నెహామర్ నిర్ధారించారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రియాలో మరోసారి లాక్ డౌన్ విధించారు. మరికొన్ని గంటల్లో లాక్ డౌన్ అమల్లోకి వస్తుండడంతో ప్రజలందరూ బార్లలోనూ, రెస్టారెంట్లలోనూ ఆస్వాదిస్తుండగా ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.

More Telugu News