KTR: కార్యకర్త ఆత్మహత్యాయత్నంతో బీజేపీ నేతలు నేడు చివరి కుట్రకు తెరలేపారు: కేటీఆర్

  • బీజేపీ కార్యాలయం ఎదుట కార్యకర్త ఆత్మాహుతి యత్నం
  • నగరంలో భారీ కుట్రలకు ప్లాన్ చేశారని ఆరోపణ
  • కుట్రలతో ఓట్లు పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు
KTR talks about conspiracy theory

హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట శ్రీనివాస్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నో కుట్రలు చేసిందని ఆరోపించారు. ఇవాళ బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్త ఆత్మాహుతి యత్నంతో బీజేపీ నేతలు చివరి కుట్రకు తెరలేపారని అన్నారు.

ఆ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి నిరసనగా రేపు ప్రగతిభవన్ లేక డీజీపీ కార్యాలయం, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముట్టడించాలని వ్యూహం పన్నారని, లాఠీచార్జ్, ఫైరింగ్ జరిగే స్థాయిలో ఆందోళన చేసే కుట్రకు ప్రణాళిక రూపొందించినట్టు తెలిసిందని వెల్లడించారు. కుట్రల ద్వారా దుబ్బాకలో ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

ఇప్పటికే డబ్బుల ప్రయోగం చేసి విఫలమయ్యారని, ఇవాళ కూడా హైదరాబాదులో కోటి రూపాయలు దొరికాయని తెలిపారు. ఓసారి అభ్యర్థికి చేయి విరిగినట్టు, మరోసారి బీజేపీ అధ్యక్షుడిపై దాడి జరిగినట్టు చిల్లర నాటకాలు ఆడారని వ్యాఖ్యానించారు.

More Telugu News