Chandrababu: 'గీతం' విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నాను: చంద్రబాబు నాయుడు మండిపాటు

  • కోర్టులో ఉన్న వివాదంపై ఎటువంటి ఆదేశాలు రాలేదు
  • యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం వైసీపీ కక్ష సాధింపు చర్య
  • మొన్న మాజీ మేయర్ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం 
chandra babu slams ycp

విశాఖలోని గీతం  యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని కట్టడాలను అధికారులు కూల్చివేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘ఎంతోమంది విద్యార్ధుల చదువులకు,యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతోన్న విశాఖలోని అత్యున్నత 'గీతం' విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నాను. కోర్టులో ఉన్న వివాదంపై,ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం వైసీపీ కక్ష సాధింపు చర్య’ అని ఆయన ట్వీట్లు చేశారు.

‘ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై ఇలా విధ్వంసాలకు పాల్పడటం రాష్ట్ర ప్రగతికి చేటుదాయకం. మొన్న మాజీ మేయర్ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం, నేడు గీతం వర్సిటిలో విధ్వంసం వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. వ్యక్తులపై, పార్టీపై అక్కసుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలను గర్హిస్తున్నాం’ అని చెప్పారు.

‘గవర్నమెంట్ టెర్రరిజం అంటూ ఇప్పటికే విద్యా, వైద్య ,పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు రావాలంటేనే భయపడే దుస్థితి ఏర్పడింది.ఇక్కడి హింసా విధ్వంసాలను చూసి బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా అనుకుంటూ అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి’ అని చంద్రబాబు నాయుడు చెప్పారు.

‘కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా కోట్ల రూపాయల నష్టాన్ని భరించి 2590 మంది కోవిడ్ పేషంట్లకు చికిత్స అందించింది గీతం సంస్థ. అలాంటి ఆదర్శవంతమైన సరస్వతీ నిలయాన్ని అర్థరాత్రి 200 మందితో వెళ్ళి కూల్చడం దారుణం’ అని చంద్రబాబు అన్నారు.

‘కట్టడం చేతగానివాళ్లకు కూల్చే హక్కులేదు.ఇప్పటికే చదువు,ఉపాధి,ఆరోగ్య చికిత్సల కోసం ఏపీ ప్రజలు పక్కరాష్ట్రాలకు పోతున్నారు.ఈ సమయంలో అటు విద్యాసేవ,ఇటు సామాజికసేవల్లో చేయూత అందిస్తూ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్థలపై రాజకీయ కక్షసాధింపు మరో తుగ్లక్ చర్య’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

More Telugu News