Kerala: నిబంధనలు సడలించి కేరళ మూల్యం చెల్లించుకుంది: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు

  • కేరళలో 17 రోజుల్లో 1.35 లక్షల కేసులు
  • తొలుత కరోనాను కట్టడి చేసిన రాష్ట్రాల్లో కేరళ
  • ఓనమ్ సమయంలో నిబంధనల సడలింపు
  • అదే విషయాన్ని ప్రస్తావించిన హర్షవర్ధన్ 
Central Minister Harshavardhan Comments on Kerala

ఈ నెల ప్రారంభం నుంచి 17వ తేదీ వరకూ కేరళలో వచ్చిన కరోనా కేసులు 1.35 లక్షలకు పైగానే. తొలి దశలో విజృంభించిన మహమ్మారిని నిలువరించడంలో విజయవంతమై, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కేరళ, పండగల వేళ నిబంధనలను సడలించి, తగిన మూల్యం చెల్లించుకుందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. పండగల వేళ, ప్రయాణాలను అనుమతించి తప్పు చేశారని, ప్రజలు మూకుమ్మడిగా పండగలు చేసుకునేలా నిబంధనలను సడలించారని ఆయన గుర్తుచేశారు.

"ఓనమ్ పర్వదినాల్లో మహమ్మారి విజృంభించింది. రోజువారీ కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా దసరా - దీపావళి సీజన్ మొదలైంది. అన్ని రాష్ట్రాలూ కోవిడ్ ప్రణాళికల్లో అలసత్వం ప్రదర్శించరాదు" అని అన్నారు.

 "ఓనమ్ సమయంలో చూపించిన నిర్లక్ష్యానికి కేరళ నష్టపోయింది. రాష్ట్రాల పరిధిలో వివిధ రకాల సేవలను తిరిగి ప్రారంభించడం, ప్రయాణాలు, వాణిజ్య కార్యకలాపాలు, పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరవడం తదితర కారణాలతోనే కేరళలో కేసులు పెరిగాయి" అని సోషల్ మీడియాలో 'సండే సంవాద్' కార్యక్రమంలో తనకు ఎదురైన ప్రశ్నలకు హర్షవర్ధన్ బదులిచ్చారు. కేరళ ఉదంతాన్ని మిగతా రాష్ట్రాలు ఉదాహరణగా తీసుకుని కరోనా కట్టడిపై దృష్టిని సారించాలని ఆయన కోరారు.

 కాగా, ఈ పండగ సీజన్ తో పాటు శీతాకాలం కూడా కలిసి రావడంతో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం నియమించిన ఓ కమిటీ హెచ్చరించిన గంటల తరువాత హర్షవర్ధన్, కేరళను లక్ష్యం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఏ మతం కూడా ప్రాణాలను పణంగా పెట్టి, పండగలను చేసుకోవాలని చెప్పలేదని, ప్రజలు సాధ్యమైనంత వరకూ ఇంటికే పరిమితం కావాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దాదాపు 46 రోజుల తరువాత యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల లోపునకు తగ్గడం శుభ పరిణామమని చెప్పారు.

More Telugu News