Hyderabad: హైదరాబాదులోని అత్తారింటికి వచ్చి.. వరదల్లో భార్యాబిడ్డలను కోల్పోయిన అల్లుడు!

  • జడ్చర్ల నుంచి గగన్‌పహాడ్ వచ్చిన సాదిక్
  • ఇంటిని చుట్టుముట్టిన వరద
  • కళ్లముందే కొట్టుకుపోయిన భార్య, పిల్లలు, బావమరిది
man loss his wife and children in Hyderabad floods

హైదరాబాద్‌లో విలయం సృష్టించిన వరదలు  మిగిల్చిన విషాదంలో ఇదొకటి. చుట్టపు చూపుగా భార్యాబిడ్డలతో కలిసి అత్తారింటికి వచ్చిన ఓ అల్లుడు ఒంటరిగా మిగిలాడు. భార్యాపిల్లలు వరదల్లో కొట్టుకుపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాడు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన మహ్మద్ సాదిక్ లారీ డ్రైవర్. భార్య కరీమా, కుమారులు ఆయాన్ (7), అమేర్ (4), కుమార్తె (3)తో కలిసి జీవిస్తున్నాడు. పుట్టింటికి వెళ్లొద్దామని భార్య అడగడంతో ఆదివారం గగన్‌పహాడ్‌లోని అత్తారింటికి వచ్చారు. కరీమా తల్లి అఫ్జల్ బేగం స్థానిక సెలబ్రిటీ గార్డెన్‌లో పనిచేస్తుండడంతో వారి కుటుంబం అక్కడే నివసిస్తోంది. తర్వాతి రోజు ప్రయాణానికి సిద్ధం కాగా వర్షం వారిని అడ్డుకుంది.

మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో వర్షం ప్రారంభం అయింది. దీంతో బయట నిద్రపోతున్న అత్తను లేపి దూరంగా ఉన్న బండపైకి చేర్చాడు. తిరిగి వచ్చేసరికి అప్పచెరువు నుంచి వచ్చిన వరదనీరు గార్డెన్‌ను ముంచెత్తింది. భార్య, పిల్లలు, బావమరిది అమీర్‌ఖాన్‌లు అందులో చిక్కుకుపోయారు.

కుమార్తెను కాపాడుకునే క్రమంలో సాదిక్ ఇంట్లోని ఫ్రిజ్‌పైకి ఎక్కాడు. అప్పటికే వరద నీటిలో అమీర్‌ఖాన్, భార్య, పిల్లలు కొట్టుకుపోయారు. ఆ తర్వాతి రోజు కరీమా, కుమారుడు అమేర్, బావమరిది అమీర్‌ఖాన్‌లు విగతజీవులై కనిపించారు. ఆయాన్ ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదని సాదిక్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

More Telugu News