Gadikota Srikanth Reddy: సీఎం జగన్ సీజేఐకి లేఖ రాసినప్పటినుంచి చంద్రబాబు అజ్ఞాతంలో ఉండి ఏంచేస్తున్నారు?: శ్రీకాంత్ రెడ్డి

  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ
  • చంద్రబాబు ఏ కుట్రలు చేస్తున్నారోనన్న శ్రీకాంత్ రెడ్డి
  • అమరావతి విచారణకు ఎందుకు భయపడుతున్నారని వ్యాఖ్యలు
Srikanth Reddy comments on Chandrababu

ఇటీవల సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం జగన్ సీజేఐకి లేఖ రాసినప్పటి నుంచి విపక్షనేత చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లారని, ఆయన అజ్ఞాతంలో ఉండి ఏంచేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. అజ్ఞాతంలో ఉంటూ చంద్రబాబు ఏ కుట్రలకు వ్యూహరచన చేస్తున్నారోనని అనుమానాలు కలుగుతున్నాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

అమరావతిపై విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఒకప్పుడు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వనని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ప్రతి సంఘటనకు సీబీఐ విచారణ కోరుతున్నారని విమర్శించారు. మరి అమరావతిలో అవినీతిపై విచారణ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదని అన్నారు. దొంగలు కాకపోతే విచారణకు భయపడడం ఎందుకు అని ప్రశ్నించారు.

అంతేకాదు, తాజాగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలోనూ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో రిజర్వాయర్ లు నిండడంతో తండ్రీకొడుకులు తట్టుకోలేకపోతున్నారని, రైతుల కళ్లలో ఆనందాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కరకట్టపై అక్రమంగా నివాసం ఉంటున్న చంద్రబాబు తన ఇల్లు మునిగిందంటున్నారని, ఎవరి ఇల్లు ముంచాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిని ముంచాలని ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని, కానీ వైసీపీ సర్కారు శత్రువులకు కూడా అన్యాయం చేయదని ఉద్ఘాటించారు.

More Telugu News