Tollywood: 'జాంబీ రెడ్డి' సినిమా టైటిల్‌పై వివాదం.. స్పందించిన దర్శకుడు

  • మా సినిమా టైటిల్ పేరును 'జాంబీ రెడ్డి' అని ప్ర‌క‌టించాం
  • ట్విట్ట‌ర్‌లోనూ బాగా ట్రెండ్ అయ్యింది
  • సినిమాలో ఓ క‌మ్యూనిటీని త‌క్కువ చేసి చూపించ‌డం ఉండదు 
  • ఇదొక వినోదాత్మక సినిమా  
PrasanthVarma  about the title controversy of his next film ZombieReddy

టాలీవుడ్‌లో  'అ!', 'క‌ల్కి' సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు  ప్రశాంత్ వర్మ ప్రస్తుతం  'జాంబీ రెడ్డి' అనే విభిన్న టైటిల్‌తో కొత్త సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ లోగోను ఆయన తాజాగా రిలీజ్ చేశాడు. తెలుగులో ఇదే మొట్ట‌మొద‌టి జాంబీ ఫిల్మ్. అయితే, ఈ సినిమాకు పెట్టిన టైటిల్‌పై వివాదం రాజుకుంది. ఒక సామాజిక వర్గం వారి మనోభావాలు దెబ్బతిన్నట్లు పలు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రశాంత్ వర్మ ఓ ప్రకటన విడుదల చేసి వివరణ ఇచ్చాడు.

ఇటీవ‌ల తమ సినిమాకు 'జాంబీ రెడ్డి' టైటిల్ని ప్ర‌క‌టించామని, దానికి మంచి స్పందన ‌వచ్చిందని చెప్పాడు. ట్విట్ట‌ర్‌లోనూ బాగా ట్రెండ్ అయ్యిందని అన్నాడు. ఈ పేరు చాలా బాగుందంటూ చాలా కాల్స్‌, మెసేజులు వ‌చ్చాయని చెప్పాడు. అయితే, కొంత‌మంది మాత్రం టైటిల్‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరించాడు. ఈ సినిమా ద్వారా ఎవ‌రినీ త‌క్కువ చేసి చూపించ‌డం, ప్ర‌త్యేకించి ఓ క‌మ్యూనిటీని త‌క్కువ చేసి చూపించ‌డం ఉండ‌దని ఆయన వివరించాడు.

ఇదొక వినోదాత్మక సినిమా అని, క‌రోనా చుట్టూ తిరుగుతూ, క‌ర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ ఇదని చెప్పాడు‌. క‌ర్నూలును ఈ క‌థ ఎంత హైలైట్ చేస్తుందో సినిమా చూస్తే తెలుస్తుందని చెప్పాడు. ద‌య‌చేసి టైటిల్‌ను త‌ప్పుగా ఊహించుకోవ‌ద్దని ఆయన కోరాడు. దీని ద్వారా ఏ కులాన్నీ త‌క్కువ‌చేసి చూపించ‌డం ఈ సినిమాలో ఉండ‌దన్నాడు.

                  

More Telugu News