Sonu Sood: చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో సోనూ సూద్

  • లాక్ డౌన్ సమయంలో ఎంతోమందికి సహాయం 
  • సొంత డబ్బు పదికోట్లు ఖర్చు చేసిన వైనం
  • రియల్ హీరో అనిపించుకున్న వెండితెర విలన్
  • 'ఆచార్య'లో ప్రధాన విలన్ పాత్రకు ఎంపిక  
Sonu Sood to play kea role in Chiranjeevi movie

సోనూ సూద్ మంచి ఆర్టిస్టు. ఇది అందరికీ తెలిసిందే. పలు చిత్రాలలో విలన్ పాత్రలలో తనదైన శైలి అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అలాంటి వెండితెర విలన్ ఇప్పుడు నిజజీవితంలో 'హీరో' అయ్యాడు.

లాక్ డౌన్ సమయంలో తన హోటళ్లలో ఎంతోమందికి ఉచితంగా ఆశ్రయం ఇవ్వడం.. వలస కార్మికుల కోసం సొంత ఖర్చుతో ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం.. తాజాగా ఏపీలో ఓ పేద రైతు తన ఆడపిల్లలను కాడెద్దులుగా మార్చి దుక్కిదున్నుతున్న ఫొటోలను చూసి చలించిపోయి ఆగమేఘాలపై ఎనిమిది లక్షలతో వారికి ట్రాక్టర్ కొనివ్వడం.. ఇంటువంటి ఎన్నో సత్కార్యాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ ఆపత్కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం సోనూ సూద్ సుమారు 10 కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు.

ఇక విషయానికి వస్తే, సోనూసూద్ ని చిరంజీవి నటిస్తున్న చిత్రంలో కీలక పాత్రకు తీసుకున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రంలో ప్రధాన విలన్ పాత్ర కోసం ఆయనను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆయన కూడా పాత్ర నచ్చడంతో ఈ చిత్రం చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక మొదలవుతుంది.

More Telugu News