TTC: జగన్, వైవీ సుబ్బారెడ్డిలను ఉద్దేశించి రమణదీక్షితులు ప్రధాన అనుచరుడి తీవ్ర వ్యాఖ్యలు!

  • డాలర్ శేషాద్రికి కరోనా అని తెలిసింది
  • కైంకర్యాలు ఏకాంతంలో నిర్వహించాలనే సలహాను జగన్, వైవీ వినడం లేదు
  • తక్షణమే చర్యలు తీసుకోండి లేదా కర్మ ఫలితాలను ఎదుర్కోండి
SV Badri slams Jagan for not taking advice on Ekantha Kainkaryas

ఆధ్యాత్మిక చింతనకు, ప్రశాంతతకు మారుపేరైన తిరుమల అంతర్గత రాజకీయాలతో అట్టుడుకుతోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అక్కడి ప్రముఖులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలపాలవుతోంది. తాజాగా తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై వదంతులు పుట్టిస్తున్న ఎస్వీ బద్రిపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుకి ఎస్వీ బద్రి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.

కరోనా నేపథ్యంలో డాలర్ శేషాద్రి కూడా రెండు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తాజగా టెస్ట్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో బద్రి ట్విట్టర్ ద్వారా డాలర్ శేషాద్రి గురించి కామెంట్లు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్, టీటీడీ చైర్మన్ లను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం కలకలం రేపింది.

'డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అని నాకు తెలిసింది. ఇది నిజమేనా? కరోనా నేపథ్యంలో కైంకర్యాలన్నీ ఏకాంతంలోనే నిర్వహించాలనే ఒక మంచి సలహాను జగన్, వైవీ సుబ్బారెడ్డి ఎందుకు వినడం లేదు? కరోనా బారిన పడిన జీయంగార్లు ఎలా ఉన్నారు? తక్షణమే సరైన చర్యలు తీసుకోండి లేదా కర్మ ఫలితాలను ఎదుర్కోండి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీనిపై డాలర్ శేషాద్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. తనకు ఇప్పటి వరకు మూడుసార్లు కరోనా టెస్టులు నిర్వహించారని... అన్ని పరీక్షల్లోనూ నెగెటివ్ అని తేలిందని చెప్పారు. అయినప్పటికీ తనను మానసికంగా వేధించేలా బద్రి ట్వీట్లు చేస్తున్నారని అన్నారు. బద్రి ట్వీట్లతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. మరోపైపు ఎపిడెమిక్ చట్టం కింద బద్రిపై చర్యలు తీసుకోవాలని టీటీడీకి ఫిర్యాదు చేశారు. డాలర్ శేషాద్రి ఫిర్యాదుతో పోలీసులకు బద్రిపై టీటీడీ ఫిర్యాదు చేసింది.

More Telugu News