Vikarabad District: రాత్రి అందరితో కలిసి భోజనం చేసి.. గదిలోకి వెళ్లి ఉరేసుకున్న సర్పంచ్

  • వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • తీవ్ర మానసిక వేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందం
  • తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్
Village sarpanch suicide in vikarabad dist

రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన సర్పంచ్ ఉదయం శవమై కనిపించాడు. వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తపల్లికి చెందిన కావలి ఆనందం (35) గత ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందాడు. గత కొంతకాలంగా తీవ్ర మనోవేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందం మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఉదయం పొద్దెక్కినా లేవకపోవడంతో నిద్రపోతూ ఉండొచ్చని భావించిన అతడి సోదరుడు శ్రీహరి పొలానికి వెళ్లిపోయాడు.

పొలం నుంచి గంట తర్వాత వచ్చినా అన్న లేవకపోవడంతో అనుమానించిన శ్రీహరి వెనక తలుపుల ద్వారా లోపలికి వెళ్లి చూడగా దూలానికి ఉరి వేసుకుని కనిపించాడు. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని ఆనందం రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News