Crime News: ఇంటిపై నుంచి దూకి తహసీల్దార్‌ సుజాత భర్త ఆత్మహత్య

  • కొన్ని రోజులుగా ఏసీబీ విచారణ ఎదుర్కొంటోన్న సుజాత
  • ఆమె భర్తనూ ప్రశ్నించిన అధికారులు
  • ఇటీవల వారింట్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం
Tahsildar sujata husband committed suicide

హైదరాబాద్‌లోని షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత భర్త అజయ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఆయన ఇంటిపై నుంచి దూకగా, ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. లంచం తీసుకున్న కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారుల నుంచి సుజాత విచారణ ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.

వారం రోజుల క్రితం షేక్‌పేట ఎస్‌ఐ నాగార్జున ఒకరి నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. ఇందులో సుజాత హస్తం ఉందని అధికారులు తేల్చారు. దీంతో సుజాత ఇంట్లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. ఆమె ఇంట్లో మూడు బ్యాగుల్లో రూ.24.9 లక్షల నగదుతో పాటు అరకిలో బంగారం, ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విషయంలో సుజాతతో పాటు ఆమె భర్త అజయ్‌ను అధికారులు ప్రశ్నించగా వారిద్దరు భిన్నమైన వివరణలు ఇచ్చారు. ఈ కేసు ఒత్తిడితోనే అజయ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

More Telugu News