Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. పేద విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!

  • కరోనా కారణంగా స్తంభించిపోయిన విద్యా వ్యవస్థ
  • ఆన్ లైన్ విద్యాబోధన వైపు మళ్లుతున్న పరిస్థితి
  • గురుకులాల్లోని విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందించనున్న ఏపీ ప్రభుత్వం
AP Govt to give free smart phones to students

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రజలకు ఎన్నింటినో ఉచితంగా అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం... తాజాగా మరో ఉచితానికి తెర తీసింది. కరోనా నేపథ్యంలో షాపులు, గుళ్లు, రెస్టారెంట్లు తదితరాలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నా... స్కూళ్లు, కాలేజీల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. చిన్న పిల్లలకు సంబంధించిన విషయం కావడంతో ప్రభుత్వాలు తొందరపడి నిర్ణయం తీసుకోవడం లేదు.

దీంతో, పాఠశాలలు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యా బోధనకు శ్రీకారం చుడుతున్నాయి. అయితే, ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావాలంటే స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉండాల్సిందే. ప్రస్తుత పరిస్థితులలో పిల్లలకు ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లను కొనివ్వడం ఎంతో మంది తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో, విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఉచిత స్మార్ట్ ఫోన్ పథకం అందరు విద్యార్థులకు వర్తించదు. పేద విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఫోన్లను అందించనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 60 వేల మంది విద్యార్థులు చదువుతుండగా... వారిలో 30 నుంచి  40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు  అందుబాటులో వున్నాయి. దీంతో, విద్యార్థులకు రూ. 5 నుంచి 6 వేల వరకు విలువ గల స్మార్ట్ ఫోన్లను అందించాలని నిర్ణయించారు.

More Telugu News