KTR: టీఎస్ బీపాస్ పై సమీక్ష.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి కేటీఆర్

  • టీఎస్ బీపాస్ పై మంత్రి కేటీఆర్ సమీక్ష
  • జీహెచ్ఎంసీ సహా రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ బీపాస్
  • జూన్ మొదటి వారంలో అందుబాటులోకి తేవాలని ఆదేశాలు
TS BPAS review by Minister KTR

తెలంగాణలోని 87 మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ (టీఎస్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ బీపాస్ పై ఇవాళ సమీక్షించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.

జూన్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్ లైన్ లో అనుమతులు పొందేందుకు వీలుండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం మీసేవ సెంటర్లతో పాటు పౌర సేవా కేంద్రాలు, వ్యక్తిగతంగా ఇంటర్నెట్ ద్వారా కానీ, మొబైల్ యాప్ ద్వారా గానీ, ఇవేవీ అందుబాటులో లేని పక్షంలో నేరుగా గానీ దరఖాస్తు చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు.

దరఖాస్తులు పూర్తి చేసే క్రమంలో ప్రజలకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే నివృత్తి చేసుకునేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీఎస్ బీపాస్ లో భాగస్వాములైన సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు వేగవంతం చేయాలని అన్నారు. కాగా, ఇప్పటి దాకా ప్రయోగాత్మకంగా సుమారు 1100 దరఖాస్తులు టీఎస్ బీపాస్ ద్వారా వచ్చాయని కేటీఆర్ కు అధికారులు తెలిపారు.

More Telugu News