Telangana: 45 రోజుల తర్వాత కళకళలాడిన తెలంగాణ

  • గ్రీన్, ఆరెంజ్ జిల్లాల్లో సందడే సందడి
  • సరి, బేసి విధానంలో తెరుచుకున్న 50 శాతం దుకాణాలు
  • మద్యం షాపుల వద్ద తగ్గిన రద్దీ
Shops reopen in Telangana after 45 days

దాదాపు నెలన్నర తర్వాత తెలంగాణ మళ్లీ కళకళలాడింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని పట్టణాలు, పల్లెల్లో జన సంచారం మళ్లీ మొదలైంది. రెడ్‌జోన్‌లోని జిల్లాలు మినహా మిగతా వాటిలో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హోంనీడ్స్ నుంచి మొబైల్ దుకాణాల వరకు అన్నీ తెరుచుకున్నాయి. సరిబేసి విధానంలో దాదాపు 50 శాతం దుకాణాలు తెరవడంతో సందడి కనిపించింది. నిబంధనలు సడలించడంతో కొనుగోళ్ల కోసం జనం రోడ్లెక్కారు. ఫలితంగా రోడ్లన్నీ జనంతో కొత్త కళ సంతరించుకున్నాయి. సాయంత్రం వరకు హడావుడి కొనసాగింది.

నిబంధనల సడలింపు కారణంగా అవసరం లేకున్నా కొందరు రోడ్లపైకి రావడం మాత్రం కొంత ఆందోళన కలిగించింది. కార్యాలయాలు, కార్ఖానాలు తెరవడంతో కార్మికులు, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. బుధవారంతో పోలిస్తే గురువారం మద్యం షాపుల వద్ద రద్దీ కొంత మేర తగ్గింది. నిబంధనలు పాటించని హెయిర్ సెలూన్లను కాసేపటికే అధికారులు మూసివేయించారు. మరోవైపు, రిజిస్ట్రేషన్, రవాణా శాఖ సేవలు బుధవారం నుంచి మొదలయ్యాయి. మొన్న రాష్ట్రవ్యాప్తంగా 644 రిజిస్ట్రేషన్లు జరగ్గా, నిన్న 1574 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News