Chandrababu: కార్మికులకు శుభాకాంక్షలు.. ఇళ్లల్లోనే మే డే జరుపుకోండి: చంద్రబాబు నాయుడు

  • లాక్ డౌన్ తో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి
  • కరోనా’పై  పారిశుద్ధ్య కార్మికులు ముందుండి పోరాడుతున్నారు  
  • పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మూసేయడం దారుణం
Chandrababu Naidu statement

రేపు మే డేను పురస్కరించుకుని కార్మికులందరికీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా కార్మికులు తమ ఇళ్లల్లోనే  మే డే జరుపుకోవాలని సూచించారు. ‘కరోనా’పై పోరులో భాగంగా ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్న వారిలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారని, వారి సేవలు మరువలేనివని ప్రశంసించారు.

‘కరోనా’, లాక్ డౌన్ ల వల్ల ఆటోలు, లారీల డ్రైవర్లు, వలస కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారడం బాధకు గురిచేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లాక్ డౌన్ కు ముందు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేత వల్ల, వైసీపీ సర్కార్ సృష్టించిన కృత్రిమ ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసేసిందని ధ్వజమెత్తారు. కార్మికుల ఆకలిబాధలు తీర్చేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.

More Telugu News