TRS: సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించి జెండా ఎగురవేసిన కేసీఆర్.. ఫొటోలు ఇవిగో!

  • తెలంగాణ తల్లికి పూలమాల వేసిన కేసీఆర్
  • ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళి
  • కార్యక్రమం ముగిసిన వెంటనే వెళ్లిపోయిన కేసీఆర్
TRS celebrates formation day

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుంది. ఈ సందర్భంగా హైదరాబాదులోని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, తెలంగాణలో అన్ని రంగాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాలను సాధించిందని చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.

పార్టీ 20వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాల్సి ఉన్నప్పటికీ... కరోనా కారణంగా నిరాడంబరంగా నిర్వహించుకోవాలని నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు వారి ప్రాంతాల్లో నిరాడంబరంగా పార్టీ పతాకావిష్కరణ చేయాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

మరోవైపు, ఈ వేడుకలకు పార్టీ ప్రధాన కార్యాలయానికి అతి కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. నేతలంతా సామాజిక దూరాన్ని విధిగా ఆచరించారు. తొలుత తెలంగాణ తల్లికి పూలమాల వేసి  నమస్కరించిన కేసీఆర్... ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం గులాబీ జెండాను ఎగురవేశారు. పతాకావిష్కరణ కార్యక్రమం పూర్తి కాగానే... కేసీఆర్ అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు.
.

More Telugu News