IIT Delhi: ఢిల్లీ ఐఐటీ ఆవిష్కరణ... భారీగా తగ్గనున్న కరోనా పరీక్షల వ్యయం!

  • కరోనాను పరీక్షించేందుకు నూతన విధానం
  • ఆమోదించిన ఐసీఎంఆర్
  • భారీగా కిట్లను తయారు చేయనున్న ఢిల్లీ ఐఐటీ
ICMR Approved Delhi IIt Corona Testing Kits

మానవ శరీరంలో కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకునే సులువైన, తక్కువ ఖర్చుతో కూడిన విధానాన్ని ఢిల్లీ ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) అభివృద్ధి చేయగా, దానికి ఐసీఎంఆర్ నుంచి అనుమతి లభించింది.

రియల్ టైమ్ పీసీఆర్ ఆధారిత రోగ నిర్ధారణలో ఓ విద్యా సంస్థ తయారు చేసిన పరికరానికి ఐసీఎంఆర్ ఆమోదం లభించడం ఇదే తొలిసారి. చైనా నుంచి దిగుమతి అయిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వాడకాన్ని నిలిపివేసిన తరుణంలో ఢిల్లీ ఐఐటీ తయారు చేసిన కిట్లకు అనుమతి లభించడం గమనార్హం.

ఈ కిట్ల ద్వారా 100 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వస్తున్నాయని నిర్ధారించిన తరువాతనే ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఇక ఈ విధానం ఇప్పటివరకూ అమలులో ఉన్న టెస్టింగ్ ప్రక్రియలకు అయ్యే వ్యయాన్ని కూడా తగ్గిస్తుందని ఢిల్లీ ఐఐటీ పరిశోధకులు వెల్లడించారు. ఇక ఈ తరహా కిట్లను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయడంపై ఐఐటీ దృష్టిని సారించింది.

More Telugu News