Yogi Adityanath: యూపీ సీఎం యోగి తండ్రి మృతి.. అంత్యక్రియలకు హాజరుకాలేనన్న ఆదిత్యానాథ్!

  • అనారోగ్య కారణాలతో ఇవాళ మృతి చెందిన ఆనంద్ సింగ్
  • ఓ సమావేశంలో ఉండగా ఈ విషాదవార్త తెలుసుకున్న యోగి
  • చివరి క్షణాల్లో ఆయనతో వుందామనుకున్నా కుదర్లేదన్న యోగి  
UP CM s father Anand singh Bist death

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ (89)  ఈరోజు మృతి చెందారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ‘కోవిడ్-19’ పై నిర్వహిస్తున్న ఓ సమావేశంలో యోగి పాల్గొన్న సమయంలో తన తండ్రి మరణవార్త సమాచారం ఆయనకు అందింది.

తన తండ్రి మృతిపై  యోగి ఆదిత్యానాథ్  విచారం  వ్యక్తం చేశారు. రేపు నిర్వహించనున్న తన తండ్రి అంతిమసంస్కారాలకు తాను హాజరు కాలేకపోతున్నానని, ‘కరోనా’ కట్టడికి చేస్తున్న పోరాటం నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తన తండ్రి మరణవార్త విని చాలా బాధపడ్డానని అన్నారు. నమ్మకంగా ఉండడం, కష్టపడడం, నిస్వార్థంగా ఉండటం గురించి తన తండ్రి తనకు ఎప్పుడూ చెబుతుండేవారని గుర్తుచేసుకున్నారు.

తన తండ్రి చివరి క్షణాల్లో ఆయనతో గడుపుదామనుకున్నాను కానీ, రాష్ట్రంలోని 23 కోట్ల మంది ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఉత్తరాఖండ్ లోని పౌరి జిల్లాలోని స్వగ్రామానికి ఆనంద్ సింగ్ బిష్ట్ భౌతిక కాయాన్ని తరలించనున్నారు. రేపు తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకానున్న తన తల్లి, బంధువులు లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని కోరారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత తాను అక్కడికి వెళతానని చెప్పారు.

 ప్రముఖుల సంతాపం

యోగి తండ్రి మృతిపై పలువురు రాజకీయప్రముఖులు  సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు వారిలో ఉన్నారు.  

More Telugu News