Police: వాహనాల్లో సరకుల మధ్య దాక్కొని హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్లిన 31 మంది కూలీలు

  • చివరకు అదుపులోకి తీసుకున్న పోలీసులు 
  • రెండు వాహనాలు సీజ్
  • క్వారంటైన్‌కు తరలింపు
  • వైద్య పరీక్షలు చేయిస్తామన్న పోలీసులు
police arrests migrants

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంత ప్రాంతాలకు చేరుకోవాలని కొందరు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునైనా సరే ఇంటికి వెళ్లాలని ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల సరఫరా వాహనాలు, అంబులెన్సులను వినియోగించుకుంటూ పోలీసులకు పట్టుబడుతున్నారు.

హైదరాబాద్‌ నుంచి నిత్యావసర సరకులతో విజయనగరం వచ్చిన రెండు వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు అందులో 31మంది వలస కార్మికులు ఉండడాన్ని గుర్తించారు. ఆ రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

రెండు రోజుల క్రితమే వారు హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. చెక్‌పోస్టులు దాటే క్రమంలో సరకుల మధ్య దాక్కున్నారు. గత అర్ధరాత్రి దాటాక విజయనగరంలోని గజపతినగరం చేరుకున్నారు. అయితే, ఆ రెండు వాహనాలపై అనుమానం రావడంతో పోలీసులు సరకులను పరిశీలించారు. అందులో 31 మంది ఉన్నారని గుర్తించి అరెస్టు చేశారు.

వారందరినీ పార్వతీపురం క్వారంటైన్‌ కేంద్రానికి తరలించామని, వారికి వైద్యపరీక్షలు జరపనున్నారని పోలీసులు చెప్పారు. ఆ కూలీలంతా పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం మండలాలకు చెందిన వారని వివరించారు.

More Telugu News