Corona Virus: కరోనా వైరస్ లోకల్ ట్రాన్స్ మిషన్ దశకు వెళ్లదు... నియంత్రణ సాధ్యమేనన్న కేంద్రం!

  • ఇక నియంత్రణపై మరింత దృష్టిని సారించాలి
  • ఐసొలేషన్ వార్డులు, టెస్టింగ్ సామర్థ్యం పెంచాలి
  • 20 పేజీల డాక్యుమెంట్ ను విడుదల చేసిన ఆరోగ్య శాఖ
Virus leaves behind local transmission in India

ఇండియాలో కరోనా వైరస్ లోకల్ ట్రాన్స్ మిషన్ దశకు వెళ్లబోదని, ఇక, వైరస్ మరింతమందికి వ్యాపించకుండా చేసి, నియంత్రించడం సాధ్యమేనని కేంద్రం అభిప్రాయపడింది. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ ముగియడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ కీలక ప్రకటన వెలువరించింది.

ఇండియాలో ప్రస్తుతం ప్రతి 96 గంటలకూ వైరస్ పాజిటివ్ కేసులు రెట్టింపు అవుతున్నాయని, దేశంలోని 736 జిల్లాల్లో 300 జిల్లాలకు వైరస్ వ్యాపించిందని గుర్తు చేసిన ఆరోగ్య శాఖ, అన్ని రాష్ట్రాలూ తాము ఇటీవల విడుదల చేసిన "కంటైన్ మెంట్ ప్లాన్ ఫర్ లార్జ్ అవుట్ బ్రేక్స్"  సూచనలను అనుసరించి వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్నాయని పేర్కొంది.

"వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మరిన్ని చర్యలకు ఉపక్రమించాలి. ఏఏ ప్రాంతాల్లో కార్యకలాపాలను విస్తృతం చేయాలో నిర్ణయించుకోవాలి. వైరస్ అధికంగా ఉన్న ప్రాంతాల సరిహద్దులను అనుసరించి, కేసులపైనా, పాజిటివ్ గా వచ్చిన వారు కలుసుకున్న వారిపైనా నిఘాను పెంచాలి. టెస్టింగ్ లాబొరేటరీల సామర్థ్యాన్ని విస్తరించాలి. అన్ని అనుమానిత కేసుల రక్త పరీక్షలూ జరిపించాలి. ఐసొలేషన్ వార్డుల సంఖ్యను పెంచాలి. హై రిస్క్ కాంటాక్టులపై నిరంతర నిఘా ఉంచాలి. వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి సత్వర చికిత్స కూడా ముఖ్యమే" అని ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక సామాజిక దూరం నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలని, వైరస్ హాట్ స్పాట్ లపై ఓ పరిధిని నిర్ణయించుకుని ముందడుగు వేయడం ద్వారా, మరో ప్రాంతానికి వైరస్ వెళ్లకుండా చేయవచ్చని సూచించింది. హెల్త్ కేర్ వర్కర్లకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాన్ని ఇవ్వాలని, తద్వారా వారు వైరస్ బారిన పడకుండా నియంత్రించ వచ్చని సూచించింది. ఆడియో, విజువల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంచే చర్యలు చేపట్టాలని కోరింది.

ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, ప్రైవేటు ఆసుపత్రులు, లాబొరేటరీల్లో కరోనా రక్త పరీక్షలను జరిపించేలా చర్యలు చేపట్టాలని సూచిస్తూ, 20 పేజీల డాక్యుమెంట్ ను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఇదే డాక్యుమెంట్ లో కరోనాకు చికిత్స చేసే ఆసుపత్రుల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఉండాల్సిన సదుపాయాలపైనా చర్చించింది. ఆసుపత్రుల్లో కరోనా కోసం ప్రత్యేక బ్లాక్స్ ఏర్పాటు చేయాలని, బాధితుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్ మరొకరికి సోకని విధంగా ఐసొలేషన్ వార్డులు ఉండాలని ఆదేశించింది.

కరోనా సోకిన వారిలో 15 శాతం మందికి ఆసుపత్రిలో చికిత్స తప్పనిసరని అభిప్రాయపడ్డ ఆరోగ్య శాఖ, వీరిలో 5 శాతం మందికి వెంటిలేటర్లు అవసరమని, ఈ మేరకు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. వైరస్ స్థాయి స్వల్పంగా ఉన్నవారు, తాత్కాలిక హాస్పిటలైజేషన్ అవసరమైన కేసుల కోసం కూడా తగు ఏర్పాట్లు చేయాలని కోరింది. కొన్ని కరోనా పాజిటివ్ కేసుల్లో, శరీరంలోని అవయవాలు పనిచేయని స్థితి కూడా ఏర్పడుతుందని, వారి కోసం ఐసొలేషన్ ఐసీయూ కేంద్రాలు తప్పనిసరని పేర్కొంది.

ఇక కరోనా నియంత్రణ ఆపరేషన్స్ ఎప్పుడు నిలిపివేయవచ్చో కూడా ఆరోగ్య శాఖ వెల్లడించింది. "ఓ ప్రాంతం లేదా హాట్ స్పాట్, లేదా క్వారంటైన్ జోన్ లో చివరి కరోనా పాజిటివ్ కేసు వచ్చిన తరువాత, నాలుగు వారాల పాటు మరో పాజిటివ్ కేసు రాకుంటే, ఆ ప్రాంతంలో వైరస్ లేదని భావించవచ్చు. అంటే కనీసం 28 రోజుల పాటు నియంత్రణా నిబంధనలు ఆయా ప్రాంతాల్లో పటిష్ఠంగా అమలు చేయాల్సిందేనని, కొత్త కేసులు వస్తే, ఆ తేదీ నుంచి మరో 28 రోజుల నియంత్రణ పాటించాలి" అని ఆదేశించింది.

More Telugu News