Corona Virus: తెలంగాణలో మూడేళ్ల బాలుడికీ కరోనా.. 41కి పెరిగిన బాధితుల సంఖ్య

  • సౌదీ నుంచి వచ్చిన గోల్కొండకు చెందిన కుటుంబం
  • రెండో దశలో ఆరుగురికి సోకిన వైరస్
  • వారిలో ముగ్గురు మహిళలే
Three year Boy infected to Corona virus in Telangana

తెలంగాణలో నిన్న మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. ఆ ఇద్దరిలో మూడేళ్ల బాలుడు ఉండడం గమనార్హం. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 41కి చేరుకుంది. హైదరాబాద్‌లోని గోల్కొండకు చెందిన బాధిత బాలుడి కుటుంబం ఇటీవల సౌదీ అరేబియా నుంచి వచ్చింది. ఆ వెంటనే బాలుడిలో జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. నిన్న బాలుడికి పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

రెండో కేసులో బాధితురాలు ఓ మహిళ. రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన ఓ వ్యక్తి (49) కొన్ని రోజుల క్రితం లండన్ నుంచి వచ్చాడు. అతడికి ఇప్పటికే వైరస్ సోకగా, తాజాగా ఆయన భార్య (43)కు కూడా వైరస్ సోకినట్టు బుధవారం నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఈమెతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ రెండోదశకు గురైన కేసులు ఆరుకు చేరాయి. వీరిలో ముగ్గురు మహిళలే కావడం గమనార్హం. కాగా, బాధితులందరూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారని, వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

More Telugu News