Nandan: ఎంత బోర్ కొట్టినా ఇలాగే ఉంటా: స్వీయనిర్బంధంలో మణిరత్నం తనయుడు నందన్

  • ఇటీవలే లండన్ నుంచి వచ్చిన నందన్
  • 14 రోజుల వరకు గది దాటి వెలుపలికి రానని వెల్లడి
  • ఇది తాను స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమన్న నందన్
Maniratnam son Nandan goes self isolation

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వీయ నిర్బంధంలోకి వెళుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, సుహాసిని, మణిరత్నం దంపతుల తనయుడు నందన్ కూడా స్వీయ నిర్బంధం విధించుకున్నాడు. ఇటీవలే లండన్ నుంచి వచ్చిన నందన్ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ తర్వాత నేరుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించాడు.

"నేను బయటికి రావాలంటే మరో రెండు వారాలు పడుతుంది. అప్పటివరకు ఎంత బోర్ కొట్టినా బయటికి రాను. నేను లండన్ నుంచి ఐదు రోజుల కిందట భారత్ వచ్చాను. మన చుట్టూ ఉన్నవారి కోసం మనం చేయగలిగే అత్యల్ప సాయం ఇది. ఎవరి ప్రోద్బలం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను" అంటూ వెల్లడించాడు.

అంతేకాదు, తన తల్లి సుహాసినితో కూడా గ్లాస్ డోర్ ఇవతలి నుంచే మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. నందన్ నిర్ణయాన్ని ప్రముఖ నటి ఖుష్బూ కూడా స్వాగతించారు. సుహాసిని, నందన్ లకు అభినందనలు తెలిపారు.

More Telugu News