Gudivada Amarnath: పవన్​ కల్యాణ్​ పై మండిపడ్డ వైసీపీ నేత అమర్​ నాథ్​

  • టీడీపీకి తోక పార్టీలా బీజేపీ.. ఆ తోకకు ఇంకో ఈక పార్టీ ‘జనసేన’
  • ప్రజలను పిరికివాళ్లుగా పవన్ కల్యాణ్ అభివర్ణిస్తారా?
  • పిరికివాళ్లు ప్రజలు కాదు పవన్ కల్యాణ్ 
YSRCP MLA Gudivada Amarnath lashes out pawankalyan

టీడీపీకి తోక పార్టీలా బీజేపీ తయారైందని, ఆ తోకకు ఇంకో ఈక పార్టీ ‘జనసేన’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ స్థాపించిన ఆరేళ్లలో అనేక రాజకీయపార్టీలతో పొత్తులు పెట్టుకున్న ఘనత, ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ అధ్యక్షుడే ఓడిపోయిన ఘనత పవన్ కల్యాణ్ ది అంటూ సెటైర్లు విసిరారు.

వైసీపీని ఉద్దేశించి నేరగాళ్లకు ఓటు వేస్తారా? అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారని, నేరగాళ్లు కనుకనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు పడలేదంటూ జనసేన పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు చేసిన ప్రతి అవినీతిలో పవన్ కు వాటా ఉంది కనుకనే ప్రజలు తిరస్కరించారని దుమ్మెత్తిపోశారు. ప్రజలను పిరికివాళ్లుగా అభివర్ణిస్తున్న పవన్ కల్యాణ్ కు రాజకీయపార్టీని నడిపే అర్హత లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిరికివాళ్లు ప్రజలు కాదని, పవన్ కల్యాణ్ అని,‘పవర్ స్టార్’ కాదు, ‘పిరికిస్టార్’ అని పేరు పెట్టాలంటూ విరుచుకుపడ్డారు.

విశాఖలో కన్నా భూమికి కాంపౌండ్ వాల్ కట్టి ఉందని, ఆయన భూమిని ఎవరూ కబ్జా చేయలేదని అమర్ నాథ్ స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులపై బురదజల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అని కన్నా ను ప్రశ్నించారు.  టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వైసీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

More Telugu News