Kannababu: మాచర్ల వరకు బోండా ఉమ వంటి నేతలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?: ఏపీ మంత్రి కన్నబాబు

  • అలజడులు రేపి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారు
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదు
  • ఆ పార్టీకి బలవంతంగా ఎవరినో ఒకరిని పోటీకి పెట్టాల్సిన పరిస్థితి
kanna babu mocks on chandrababu

మాచర్లలో టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తల దాడి విషయంపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. విజయవాడ ఎన్నికలు వదిలేసి బోండా ఉమ వంటి టీడీపీ నేతలు మాచర్లకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన నిలదీశారు. అలజడులు రేపి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని కన్నబాబు విమర్శించారు. బలవంతంగా ఎవరినో ఒకరిని ఎన్నికల్లో పోటీకి పెట్టాల్సిన పరిస్థితి ఆ పార్టీకి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. అపవిత్రమైన పొత్తులతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీపై చంద్రబాబు నాయుడు ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ ప్రజలు సీఎం జగన్‌కే మద్దతు తెలుపుతారని చెప్పారు. మంచి పనులను ఎలా అడ్డుకోవాలన్న ఆలోచనే తప్ప చంద్రబాబుకు మరో ఆలోచన లేదని అన్నారు.

More Telugu News