Chintalapudi Venkataramaiah: గత ఎన్నికల్లో పవన్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీలో చేరిక

  • గత ఎన్నికల్లో పవన్ కోసం గాజువాక సీటును త్యాగం చేసిన చింతలపూడి
  • విజయసాయి సమక్షంలో పార్టీలో చేరిక
  • జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
Gajuwaka Ex MLA Chintalapudi joins ysrcp

ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీని వీడిన విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య వైసీపీలో చేరారు. ఆ పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విజయసాయి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వెంకట్రామయ్య మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. జనసేన పార్టీని వీడిన తర్వాత ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరని ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు వైసీపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

2009లో చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన వెంకట్రామయ్య 17 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కోసం గాజువాక సీటును త్యాగం చేశారు. గత ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే, గత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ ఏ పార్టీలోనూ చేరని ఆయన ఇప్పుడు వైసీపీ గూటికి చేరారు.

More Telugu News