IYR Krishna Rao: రాష్ట్రాలకు ఆ అధికారాలు లేవు.. ఈ నాయకులు ప్రజలను మభ్య పెడుతున్నారు!: ఐవైఆర్ కృష్ణారావు

  • ఎన్‌పీఆర్‌ చేపట్టలేమంటూ పలు రాష్ట్రాల సీఎంల ప్రకటనలు
  • సీఏఏ చట్టం మీద రాష్ట్రానికి ఎటువంటి అధికారమూ లేదు
  • దీనిని అమలు చేసేది సెన్సెస్ కమిషనర్
  • ప్రజలు ఈ అంశాన్ని గ్రహించాలి 
iyr krishna rao on npr

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నవీకరణ ప్రక్రియ చేపట్టలేమంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు చేస్తోన్న ప్రకటనలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. ఆ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు లేవని, ప్రజలను మభ్య పెట్టడానికే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు.

'జగన్, కేసీఆర్, మమతా బెనర్జీ ఇంకా కొందరు ముఖ్యమంత్రులు తమ మైనారిటీ ఓటు బ్యాంకు పదిలపరచుకోవడం కోసం ఎన్‌పీఆర్ అమలు చేయమంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఎన్‌పీఆర్ పౌరసత్వ చట్టం కింద రూపొందించిన రూల్స్ కి అనుగుణంగా ఏర్పాటయింది. ఈ చట్టం మీద రాష్ట్రానికి ఎటువంటి అధికారం లేదు' అని తెలిపారు.
 
'ఇక దీనిని అమలు చేసేది సెన్సెస్ కమిషనర్. సెన్సెస్ చట్టం కింద ఈయన కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పని చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సెన్సెస్ పని వరకు ఆయన పరిధిలోనే పని చేస్తారు. సహాయ సహకారాలు అందించడమే కానీ సెన్సెస్ వరకు వారిని నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు' అని చెప్పారు.
 
'లేని అధికారాలు ఉన్నట్లు ప్రకటనలు ఇస్తూ ఈ నాయకులు ప్రజలను మభ్య పెడుతూ ఉన్నారు. సెన్సెస్ విషయంలో సహకరించకపోతే పౌరుల పైన అధికారుల పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం సెన్సెస్ కమిషనర్ కు ఉంది. ప్రజలు ఈ అంశాన్ని గ్రహిస్తే రాజకీయ నాయకులు ఎట్లా రెచ్చగొట్టినా సమస్యలకు తావుండదు' అని తెలిపారు.

More Telugu News