పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ కు చేదు అనుభవం

  • మీడియాతో భేటీలో విమర్శలతో అవమానించిన పాత్రికేయుడు
  • ప్రతిగా సదరు పాత్రికేయుడి అక్రిడేషన్ సస్పెన్షన్
  • పాత్రికేయులు ప్రశ్నలు అడగవచ్చు, దూషించకూడదు: పీసీబీ
ప్రపంచకప్ లో, ఇటు దేశంలో  శ్రీలంకతో జరిగిన టీ -20 సిరీస్ లో జట్టును విజయ పథాన నిలపడంలో విఫలమైన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు మీడియా సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది. పాకిస్తాన్ టీ -20 కప్ టోర్నమెంట్ సందర్భంగా ఏర్పాటైన  సమావేశంలో ఒక పాత్రికేయుడు  సర్ఫరాజ్ ను అవమానించాడు.  ఈ టోర్నీలో సర్ఫరాజ్ సింధ్ జట్టు తరపున బరిలోకి దిగుతున్నాడు.

‘సర్పరాజ్  మీరు క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చారు. మిమ్మల్ని చూసేందుకు ఎవరు వస్తారు’ అని ప్రశ్నించాడు. దీనికి హతాశుడైన సర్ఫరాజ్ మౌనంగా ఉండిపోయాడు. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది. మరోవైపు సర్ఫరాజ్ అభిమానులు విమర్శలు చేసిన  పాత్రికేయుడి వైఖరిని తప్పు బట్టారు. పాకిస్తాన్ కు ఎన్నో విజయాలు అందించిన సర్ఫరాజ్ పై విమర్శలు తగవని స్పందించారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా పాత్రికేయుడి విమర్శలను తీవ్రంగా పరిగణించింది. అతని మీడియా అక్రిడేషన్ ను సస్పెన్షన్ లో పెట్టడమేకాక, ఫైసలాబాద్ లోని  ఇక్బాల్ స్టేడియంలో ప్రవేశాన్ని నిషేధించింది. ఆటగాళ్లను ప్రశ్నలు అడిగే హక్కు పాత్రికేయులకు ఉంది.. కాని వారిని దూషించకూడదు అని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Go Back to Shorts
Pakistan
cricketer
Sarfaraj
PCB
Media

More Telugu News