Andhra Pradesh: కర్నూలు జిల్లాలో రెండు లారీలను ఢీకొట్టిన తెలంగాణ ఆర్టీసీ బస్సు

  • ముందు వెళ్తున్న లారీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
  • డ్రైవర్ సహా పదిమందికి గాయాలు
  • డ్రైవర్ నిద్ర మత్తే కారణం
కర్నూలు జిల్లా డోన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమంది గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీకి చెందిన గరుడ బస్సు డోన్ సమీపంలో జాతీయ రహదారిపై కంబాలపాడు సర్కిల్ వద్ద ముందు వెళ్తున్న లారీలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించి క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Kurnool District
Done
TSRTC
Road Accident

More Telugu News