థియేటర్ల మాఫియాతో 'పేట'కు సమస్య: నిర్మాత ప్రసన్నకుమార్ ఆరోపణ

  • సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరు
  • సంక్రాంతికి ఆరేడు సినిమాలకు ప్రేక్షకులు ఉంటారు
  • ఇతరులను బతకనివ్వని థియేటర్ మాఫియా
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మాఫియా కారణంగా రజనీకాంత్ నటించిన 'పేట' సినిమాకు సమస్య ఉందని నిర్మాత టి.ప్రసన్నకుమార్ అన్నారు. సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరని, అయితే, ముగ్గురు, నలుగురు చేస్తున్న సినిమాలకు మాత్రమే అన్ని థియేటర్లనూ కేటాయించుకుంటున్నారని, ఇతరులను బతకనిచ్చే పరిస్థితి లేదని ఆయన వాపోయారు.

రజనీ కొత్త చిత్రం 'పేట' ఈ నెల 10న విడుదలవుతున్న సందర్భంగా మరో నిర్మాత వల్లభనేని అశోక్ తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, కొత్త వాళ్లు వచ్చే పరిస్థితి లేకుండా చూస్తూ థియేటర్ల మాఫియా చాలా నీచంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సంక్రాంతికి కనీసం ఆరేడు సినిమాలకు ప్రేక్షకులు ఉంటారని, కానీ, ఉన్న అన్ని థియేటర్లలో ఆ రెండు మూడు సినిమాలు మాత్రమే ఆడిస్తుంటే ఎలాగని ప్రశ్నించారు. ఈ మాఫియాను తొలగించేందుకు సీఎంలు కేసీఆర్, చంద్రబాబులతో మాట్లాడతామని, తమ సినిమాలే ఉండాలన్న ధోరణి మంచిది కాదని అన్నారు.

కాగా, ఈ సంక్రాంతికి 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'వినయ విధేయ రామ', 'ఎఫ్ 2', 'పేట'లతో పాటు 'విశ్వాసం', 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' వంటి సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో రెండు మూడు సినిమాలకు కనీసం 100 థియేటర్లు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు.
Go Back to Shorts
Peta
Prasanna Kumar
Theater Mafia
Sankranti

More Telugu News