Andhra Pradesh: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. మనస్తాపంతో ప్రేమికుడి ఆత్మహత్య!

షార్ట్స్‌లో చూడండి
ప్రాణప్రదంగా ప్రేమించిన యువతికి నిశ్చితార్థం అయిందన్న విషయం తెలుసుకున్న యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్లలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ (22) టీటీసీ చదువుకుని డీఎస్సీ కోసం కర్నూలులో శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలో బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు.

గురువారం మండలంలోని పెద్ద నెలటూరులో బంధువుల ఇంట్లో జరిగిన నామకరణ వేడుకకు తండ్రి నాగభూషణం ఆచారితో కలిసి హాజరయ్యాడు. అక్కడ ఉండగానే తాను ప్రేమించిన యువతికి నిశ్చితార్థం అయినట్టు తెలిసింది. తీవ్ర మనస్తాపానికి గురైన రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుమారుడి మృతితో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే,  ఇంత విషాదంలోనూ కుమారుడి కళ్లను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Lover
Kurnool District
Gonegandla
suicide

More Telugu News